**శ్రీవారి సేవలో సోనూ సూద్: నూతన ప్రాజెక్ట్ 'నంది' ప్రకటన**
ప్రముఖ నటుడు సోనూ సూద్ ఈరోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం, వేదపండితులు రంగనాయకుల మండపంలో ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల విలేకరులతో సోనూ సూద్ మాట్లాడారు. "నేను మొదటిసారి ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అయింది. ఈరోజు నేను నా కుటుంబంతో కలిసి ఇక్కడికి వచ్చాను. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించాను" అని తెలిపారు.
ఈ సందర్భంగా తన నూతన ప్రాజెక్ట్ను కూడా ఆయన వెల్లడించారు. "మేము ఒక కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నాం. 'నంది' అనే పేరుతో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రంలో నేను నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నా. ఇది త్వరలో ప్రారంభమవుతుంది" అని సోనూ సూద్ ప్రకటించారు. ఆయన ప్రకటనతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నిండింది. 'నంది' చిత్రంపై మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.







No comments:
Post a Comment