Full width home advertisement

Post Page Advertisement [Top]

సినిమాకు దర్శకత్వం వహించేందుకు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో బద్రి సినిమాకు తయారుచేసుకున్న కథను పూరీ జగన్నాథ్ అప్పటికే హీరోగా నిలదొక్కుకున్న పవన్ కళ్యాణ్ కి చెప్పాలని ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్ ని కలిసి కథ చెప్పేందుకు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే ముందుగా తనకి కథ చెప్పాలని, ఆయనకు నచ్చితేనే పవన్ కళ్యాణ్ కి చెప్పే అవకాశమిస్తామని ఛోటా చెప్పారు. అయితే ఇద్దరు హీరోయిన్లతో ప్రేమ పేరుతో జరిగే ఆటలాంటి బద్రి కథ ఓ పట్టాన ఎవరికీ వినీవినగానే నచ్చే అవకాశాలు తక్కువ. అదే కథ చెప్పేస్తే ఛోటాకి నచ్చకపోవచ్చేమోనని, దాంతో పవన్ కి కథ చెప్పే అవకాశమే కోల్పోవాల్సివస్తుందని భయపడ్డారు పూరీ. దాంతో ఛోటా కె.నాయుడుకి బద్రి సినిమా కథ కాక, తాను రెడీ చేసుకున్న ఆత్మహత్యల నేపథ్యం ఉన్న ప్రేమకథని చెప్పారు. తర్వాతి కాలంలో అదే ప్రేమకథ ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంగా తీశారు. ఆయనకి కథ బాగా నచ్చేయడంతో క్లుప్తంగా కథ వివరాలు పవన్ కళ్యాణ్ కి చెప్పి పూరీ జగన్నాథ్ కి ఆయన్ని కలిసే అవకాశం ఏర్పాటుచేశారు. అయితే ఆ అవకాశం రాగానే పూరీ జగన్నాథ్ బద్రి సినిమా కథనే వివరించారు. పవన్ కళ్యాణ్ కి కథ బాగా నచ్చి సినిమాని ఓకే చేశారు. అయితే "ఇది సూసైడ్ నేపథ్యంలోని ప్రేమకథ అన్నారు ఛోటా, మరి ఇందులో సూసైడ్ కాన్సెప్టే లేదేంటి?" అంటూ ప్రశ్నించారు. పూరి జగన్నాథ్ జరిగినదంతా వివరించగా, ఆ సమయంలో పూరీ ఆందోళన అర్థం చేసుకున్న పవన్ సరేనన్నారు.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

| Designed by Colorlib